అమరవీరుల త్యాగాలకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి
ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ సందర్శన
1 / 2
న్యూఢిల్లీ: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారత సైనికుల ధైర్యసాహసాలు, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ను ఆయన సోమవారం సందర్శించి వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.వార్ మెమోరియల్లోని అమర స్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి వందనం చేశారు. కల్నల్ ఆర్.కె. ఆనంద్, కెప్టెన్ రోహిత్ గార్గ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరవీరుల జీవిత విశేషాలను సైనికాధికారులు వివరిస్తుండగా శ్రద్ధగా ఆలకించారు.
అనంతరం మెమోరియల్లోని త్యాగ చక్రం వద్ద అమరవీరుల పేర్లు చెక్కిన గ్రానైట్ ఫలకాలను పరిశీలించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వీర జవాన్ల పేర్లు ఉన్న ఫలకాల వద్ద ప్రత్యేకంగా నివాళులు అర్పించారు. వీర జవాన్ జి.ఎన్.ఆర్. సతీష్, శౌర్య చక్ర అవార్డు గ్రహీత రాజ్ కుమార్, హవల్దార్ అరుణ్ కుమార్ తదితరుల పేర్ల వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణ విశిష్టత, అందులోని నాలుగు స్మారక చక్రాల ప్రాధాన్యంపై సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు వేలాది మంది సందర్శకులు తమకు ప్రేరణగా నిలిచిన అమరవీరుల పేర్లు చెక్కిన ఫలకాలను సందర్శించి నివాళులు అర్పిస్తారని, చాలామంది ఈ స్మారకాన్ని ఓ దేవాలయంలా భావిస్తారని అధికారులు వివరించారు.
వార్ మెమోరియల్ సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ డిజిటల్ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అమరవీరుల త్యాగాల గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.